హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధిశాఖల మాజీ మంత్రి కే తారకరామారావుకు (KTR) మరో అరుదైన గౌరవం దకింది. శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (జీఈటీఎస్-గెట్స్) 2025లో ఆయన కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం అందింది. నవంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీలంక కొలంబోలోని ది కింగ్స్ బరీ హోటల్లో ఈ సదస్సు జరగనున్నది. శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తరఫున, గెట్స్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్ఏ హిల్మీ ఈ ఆహ్వానాన్ని కేటీఆర్కు ప్రత్యేకంగా పంపారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతికరంగ ప్రతినిధులు, మేధావులు, ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానున్నది.
వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఆదర్శం తెలంగాణ
ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాల్లో తెలంగాణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పోషించిన విశేష కృషిని, నాయకత్వాన్ని డాక్టర్ హిల్మీ తన లేఖలో కొనియాడారు. పెద్దఎత్తున పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను కేసీఆర్ నడిపించిన విధానం, అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కేటీఆర్ సమ్మిట్లో పాల్గొనడం వల్ల ‘దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతారు’ అని గెట్స్ సదస్సు కార్యదర్శి తెలిపారు. సాంకేతిక, ఆర్థికవృద్ధిలో భారతదేశం-శ్రీలంక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ స దస్సుకు వివిధ దేశాల నుంచి మంత్రులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ప్రతినిధులు, ఆవిషర్తలు హాజరవుతారని, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడంపై సుదీర్ఘ చర్చలు ఉంటాయని వెల్లడించారు.