హైదరాబాద్, జూన్24 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ వాటాలపై అభిప్రాయమేంటో తెలపాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కేంద్ర జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు ఇటీవల ప్రత్యేకంగా లేఖ రాసింది. కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో వినియోగించుకోవాలని 2015లో ఏడాది కాలపరిమితితో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఇకపై ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని తెలంగాణ గతేడాది నుంచి స్పష్టం చేస్తున్నది.
బోర్డు సమావేశాల్లోనూ అదే అంశాన్ని తేల్చిచెప్పింది. ఇకపై ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించే వరకూ 50:50 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను వినియోగించుకుంటామని నొక్కిచెప్పింది. ఈ విషయమైన కేంద్ర జల్శక్తి శాఖకు పలుమార్లు లేఖలను కూడా రాసింది. ఏపీ మాత్రం గతంలో మాదిరిగా 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాల వినియోగాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు ఏపీ సైతం లేఖ రాయడంతో కేంద్ర జలవనరులశాఖ తాజాగా స్పందించింది. తెలంగాణ, ఏపీ లేఖలను జతపరుస్తూ కేఆర్ఎంబీకి లేఖను రాసింది.