హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకొంటామని, మత విద్వేషాలను రెచ్చగొడ్తే సహించబోమని ఇంచార్జి డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కర్మన్ఘాట్లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనపై బుధవారం ఆయన డీజీపీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంఘటనపై రాచకొండ కమిషనర్ ఇప్పటికే ఐదు కేసులు నమోదుచేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే ఏ వ్యక్తినిగానీ, గ్రూపులను గానీ సహించేది లేదని, వారిపై హిస్టరీ షీట్లు, కమ్యూనల్ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్భగవత్, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, నార్త్ జోన్ ఏడీజీ నాగిరెడ్డి పాల్గొన్నారు.