ఐనవోలు మండలం : వరంగల్ జిల్లాలోని ఐనవోలు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని పలు అంశాలపై, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్, సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలు, నడుస్తున్న పనులు, ఆయా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐనవోలు మండలానికి ఎక్కువ నిధులను మంజూరు చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. ఐనవోలు మండలంలో మంజూరు అయిన ఈజిఎస్ పనులు నెల రోజుల్లో పనులు పూర్తి చేసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులను ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.
సమావేశంలో డీసీసీ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ వెంకట రమణ, పంచాయతీరాజ్ డీఈ దయాకర చారి, తదితరులు పాల్గొన్నారు.