హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీల నీటిని ఆల్మట్టి నుంచి తరలించే ప్రతిపాదనలను ఒప్పుకోబోమని రాష్ట్రసర్కారు స్పష్టం చేసింది. అదే జరిగితే తమ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని ఎన్డబ్ల్యూడీఏను కోరింది. ఈ నేపథ్యంలో ఎన్డబ్ల్యూడీఏ చైర్మన్కు సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ వాటాను గతం కన్నా తగ్గించారని ఆయన ఆక్షేపించారు. 50 శాతానికి తగ్గకుండా నీటి కేటాయింపులు చేయాలని నివేదించారు. ఇచ్చంపల్లి వద్ద బరాజ్ కట్టాలని ప్రతిపాదించారని, దాని వల్ల తుపాకులగూడెం బ్యాక్వాటర్ వస్తుందని, అదే జరిగితే నీటి నిల్వసామర్థ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈఅంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని ఎన్డబ్లూడీఏకు రాహుల్ బొజ్జా విజ్ఞప్తి చేశారు.