హైదరాబాద్ : తెలంగాణలో రైతు వ్యతిరేక చర్యలను అంతం చేసేందుకు మనమంతా ఏకం అవుదామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏవీ రంగనాథ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి మీడియాకు వెల్లడించారు. దేవరకొండ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ ఫోర్స్ బృందాలు 15 రోజులుగా ఈ నకిలీ దందా వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహించారు. అక్రమ దందాకు పాల్పడుతున్న 13 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఇంత పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకోవడంపై డీజీపీ మహేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. రూ.6 కోట్ల విలువైన 200 టన్నుల నకిలీ విత్తనాలను నల్లగొండ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా ముగించిన వెస్ట్ జోన్ ఐటీ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్, కేసు చేధనలో పాల్గొన్న ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రైతులకు మద్దతుగా మీ ప్రయత్నాలను కొనసాగించాల్సిందిగా తెలిపారు.