జిన్నారం, ఏప్రిల్ 29: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి 1:30 గంటలప్రాంతంలో హెటిరో పరిశ్రమ సమీపంలోని రోడ్డుపైకి చిరుత వచ్చినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. హెటిరో సిబ్బం ది అదే రాత్రి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
శుక్రవారం తెల్లవారుజామున ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు సిబ్బందితో వచ్చి చిరుత పాద ముద్రలను సేకరించారు. సీసీ ఫుటేజీలో చిరుత రోడ్డు పైకి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. పరిశ్రమలకు ఆనుకొనే అటవీ ప్రాంతం ఉండటంతో అందులోకి వెళ్లిందా? ఏదైనా మూతబడిన పరిశ్రమల్లో నక్కిందా అనే భయం కార్మికుల్లో నెలకొన్నది. అయితే చిరుత సంచరించినట్టు స్పష్టంగా చెప్పలేకపోతున్నామని అధికారులు పేర్కొన్నారు. కొందరు కార్మికులు పారిశ్రామిక వాడలోనే నివాసం ఉంటారు. చిరుత సంచారంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు.