నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు చిరుత పాదముద్రలను గుర్తించిన స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు, అటవీ అధికారులు ఉమ్మాపూర్కు చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి పులి అడుగుజాడలే అని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పులి సంచారంపై నిఘా ఉంచుతామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. స్థానికులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.