నల్లగొండ: నల్లగొండ (Nalgonda) మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ (Dumping yard) సమీపంలో చిరుత పులి (Leopard) మృతి కలకలం సృష్టించింది. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు తెలుస్తున్నది. బుధవారం ఉదయం డంపింగ్ యార్డ్ వద్ద చిరుతపులి కళేబరాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ, పోలీస్ శాఖ అధికారులు చిరుతను పరిశీలించారు.
గత కొన్ని నెలలుగా కేశరాజుపల్లి (Kesharajupally), శేషమ్మగూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి (Chandanapally) గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు సైతం చిరుత సంచారాన్ని గుర్తించారు. కాగా, డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తినడంతో అది మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఊర పందులను పట్టుకోవడానికి మందులు పెట్టినట్లు సందేహం వ్యక్తంచేశారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు అధికారులు.