సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో ల్యాబ్స్లో చిరుత సంచరిస్తున్నది. పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో దాక్కున్నది. దీంతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు కంపెనీలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని చెప్పారు.
జిల్లా అటవీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. చిరుతను బంధించేందుకును బోన్ ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. మూడు నెలల క్రితం కూడా చిరుత కంపెనీలో సంచరించినట్లు సీసీటీవీల్లో రికార్డయింది.