జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ కొట్టంలో కట్టేసిన రెండు గేదె దూడలను బుధవారం రాత్రి చిరుత చంపేసింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బాధిత రైతు సమాచారంతో స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గేదె దూడల కళేబరాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో చిరుత అడుగులను గుర్తించారు.
అనంతరం ఎస్సై మాధవ్గౌడ్, ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ నర్సింగ్ మాట్లాడుతూ సూరారం, హిమ్మత్నగర్, తీగారంతో పాటు సమీప గ్రామ శివారులో గుట్టలు, చెట్లు ఉండడంతో చిరుత పులి ఈ ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు, ఆయా గ్రామాల ప్రజలు వ్యసాయ బావుల వద్ద, ఆరు బయట, పొలాల్లో రాత్రి పూట పశువులను ఎట్టి పరిస్థితుల్లో కట్టి వేయొద్దని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.