హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పెద్దల సహకారంతో లియోనియా రిసార్ట్ యజమానులు పకనే ఉన్న కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శామీర్పేట్ మండలంలోని బొమ్రాస్పేట్ గ్రామ రైతులు.. కబ్జాకు గురవుతున్న తమ భూములను కాపాడాలని కోరుతూ మంగళవారం మాసబ్ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ భూదందాల పార్టీగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాదర్గుల్, మహబూబాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. శామీర్పేట్లో కూడా వందల కోట్ల విలువైన భూములు ఎలాగైనా కాజేయాలన్న దురాశతో, ప్రభుత్వ పెద్దల మద్దతుతో లియోనియా రిసార్ట్ యజమానులు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహబూబాబాద్, లగచర్ల, నాదర్గుల్ వంటి ప్రాంతాల్లో అధికారుల సహకారంతోనే అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. 2019లో కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ భూమికి సంబంధించి సంపూర్ణ అధికారాలు రైతులకే దకుతాయని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి, తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకొని, రిసార్ట్ యజమానులు కోట్లాది విలువైన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారులు కౌలుదారి, వ్యవసాయ భూముల చట్టం 1950లోని సెక్షన్ 93కు వ్యతిరేకంగా తప్పుడు ఆదేశాలతో కూడిన ఆర్డర్లు ఇస్తూ, అసలైన రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. అధికారులు తమ తీరు మార్చుకోకుంటే భవిష్యత్లో కచ్చితంగా ప్రజాకోర్టు ముందు దోషులుగా నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 30 ఏండ్లుగా రైతులు అకడి భూమిని సాగు చేస్తున్నారని, గతంలో కూడా తమ పూర్వీకులు అదే భూమిని నమ్ముకొని జీవనం సాగించారని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కూడా ఈ భూమి స్థానిక రైతులకే చెందుతుందని నిర్ధారించినట్టు వెల్లడించారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా, లియోనియా రిసార్ట్ యజమానులకు అనుకూలంగా ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ నాయకుల భూ దందాను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.