మిర్యాలగూడ : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే ఆర్టీసీ లాభాల పట్టిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడ డివిజన్ ఆర్టీసీ డిపోలో 21 నూతన బస్సులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఎలాంటి వసతులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో లాభాల్లో ఉన్న డిపోల్లో మన మిర్యాలగూడ మూడో స్థానంలో ఉందన్నారు. సంస్థ అభివృద్ధి కోసం బాగా కష్టపడి పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.