నిజామాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలరాస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం ఘోర తప్పిదమని పేర్కొన్నారు. కులం, మతం, జాతి, వర్గ తేడాలు లేకుండా భారతీయులందరికీ విలువైన రాజ్యాంగాన్ని అగౌరవ పర్చడమంటే దేశ ప్రతిష్ఠను, 140 కోట్ల మంది ప్రజలను అవమానపర్చినట్టేనని అన్నారు. రా జ్యాంగం ప్రకారం పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగమని, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభించటమే సరైనదని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని ఆక్షేపించారు. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉన్నందునే బీజేపీ ఈ రకంగా చులకన చేసిందని ఆరోపించారు. ‘నమస్తే తెలంగాణ’తో పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
రాజ్యాంగం ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దం. అన్ని కులాలు, మతాలు, జాతులు, వర్గాలు తూచా తప్పకుండా పాటించాల్సిన గ్రంథం. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ రాజ్యాంగం ఒక్కటే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతి అందరూ రాజ్యాంగాన్ని గౌరవించి తీరాలి. కానీ, స్వయంగా ప్రధానమంత్రే రాజ్యాంగాన్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించడం బాధాకరం. పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పాటించలేదు. రాష్ట్రపతి లేరు, ఉప రాష్ట్రపతి కనిపించలేదు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉండటం మూలంగానే కేం ద్రంలోని పెద్దలు ఈ విధంగా వ్యవహరించినట్టు అర్థమవుతున్నది. చేయరాని పనిని ప్రధాని చేసి రాష్ట్రపతిని కించపర్చారు. నూతన పార్లమెంట్ను అన్ని పార్టీల సమక్షంలో రాష్ట్రపతి చేత ప్రారంభించి ఉంటే గౌరవంగా ఉండేది. ఉప రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగి ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినవారై ఉండేవారు. కొంతకాలంగా దేశానికి నాయకత్వం వహిస్తున్న వారిలో అంతా నేనే అన్న భావన ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ నియంతృత్వ ధోరణి ఎక్కువకాలం నడువదు.
సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఎలాంటి సంబంధం లేదు. సీఎం, మంత్రులు, ఆయా శాఖల అధిపతులు ఇందులో భాగం. అది వంద శాతం సీఎం ఆధీనంలోని వ్యవస్థ. రాజ్యాంగంలో న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు ఎవరి బాధ్యతలను వారికి అప్పగించారు. అలా పని చేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సచివాలయానికి గవర్నర్ను పిలవాలని లేదు. అసెంబ్లీ కడితే అప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు కాబట్టి ఆలోచించాలి. అసెంబ్లీ స్పీకర్ హోదాలో గవర్నర్ను ఆహ్వానిస్తా. గవర్నర్ ప్రమేయం బిల్లు పాస్ చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడటం. ఎవరి పనులు వారు తెలుసుకొంటే మంచిది. మన సీఎం ఏదైనా కార్యం చేపట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి అందరి అభిప్రాయంతో ఆమోదయయోగ్యమైతేనే చేపడతారు. ప్రధానికి మాత్రం తనకు ఏది నచ్చితే అదే చేసిండు. సచివాలయం బ్రహ్మాండంగా ఉంది. టూరిస్ట్ ఐకాన్గా మారింది. చక్కగా ప్లాన్ చేశారు. పార్లమెంట్కు మన సచివాలయానికి పోలిక లేదు. పొంతన లేదు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చెబుతారు. కేసీఆర్ తెచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయో కేసీఆర్కన్నా ఇతర రాష్ర్టాల ప్రజలే చెబుతున్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పథకాలేం ఉన్నాయో ఒక్కటి చెప్పమనండి. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ప్రజలు, పేదలు, రైతుల అవసరాల కోసం తెచ్చిన ఒక్క పథకం లేదు. ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి ఇతర రాష్ర్టాల్లో చర్చించుకుంటున్నారు. ప్రధాని చేసిన పనులు చెప్పుకొనే పరిస్థితి లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. తెలంగాణ పథకాలు మాక్కూడా కావాలని అడుగుతున్నారంటే కేసీఆర్ పాలనను అర్థం చేసుకోవచ్చు.
మన శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ప్రొటోకాల్ను గౌరవిస్తూ సీఎం కేసీఆర్ పదిసార్లు నా చాంబర్కే వచ్చి మాట్లాడేవారు. నేను వస్తానంటే వద్దు… మీది నా కన్నా పెద్ద హోదా అని వారించారు. అదీ రాజ్యాంగ స్ఫూర్తి. చట్టసభలు ఈ దేశానికి అత్యున్నతమైన పవిత్ర స్థలాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సౌమ్యురాలు. విద్యావేత్త. పార్టీలకు అతీతంగా పని చేస్తున్న వ్యక్తి. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపజేస్తే ఈ దేశ ప్రతిష్ఠ మరింత పెరిగేది. ఇంకో విషయమేమిటంటే పార్లమెంట్లో స్పీకరే సర్వాధికారి. పార్లమెంట్ వెలుపల ప్రధానికి విశేష అధికారాలు ఉండొచ్చు. సభలోనూ లోక్సభ స్పీకర్ను దాటి ప్రవర్తించడం మోదీకే చెల్లింది. పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే శాంతియుతంగా నిరసన చేస్తున్న రెజ్లర్లను ఈడ్చుకెళ్లడం, వారి కంట కన్నీరు తెప్పించడం కేంద్ర ప్రభుత్వానికి సరైనది కాదు. ఆడబిడ్డల బాధను, వారి వినతిని ఆలకించకపోగా వారిపై అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాక్షసుడిగా పరిపాలన చేయడం మంచి పద్ధతి కాదు.