హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఒకరు గుర్తించిన శాసనాలను మరొకరు గుర్తించినట్టు ఎపిగ్రఫీ శాఖ ప్రకటించడం శోచనీయమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇలా జరగకుండా ఉండేందుకు దేశంలో ప్రచురించిన, ప్రకటించిన శాసనాల జాబితా ఒకేచోట దొరికే విధంగా రాష్ర్టాల పేరుమీద శాసనాల రిజిస్టర్ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డికి విజ్ఞప్తిచేశారు. ఆ జాబితాను డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని, దీనివల్ల ఒకరు గుర్తించిన శాసనం మరొకరు గుర్తించినట్టు ప్రకటించే వీలుండదని చెప్పారు. తెలంగాణ శాసన పితామహుడిగా పేరొందిన భిన్నూరి నరసింహశాస్త్రి (బీఎన్ శాస్త్రి) గతంలోనే మంచిర్యాల సమీపంలోని చెన్నూరులో కాకతీయ శాసనాన్ని గుర్తించడమే కాకుండా దాన్ని ‘కుందమాల శాసనం’గా ప్రచురించారని, తాజాగా అదే శాసనాన్ని తాను గుర్తించినట్టుగా చెన్నూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు చెప్పుకొన్నారని హరగోపాల్ పేర్కొన్నారు. ఆయన పంపిన ఫోటోల ఆధారంగా మైసూరులోని ఎపిగ్రఫీ శాఖ ఆయనే గుర్తించినట్టు ప్రకటించిందని తెలిపారు. చెన్నూరులో కాకతీయుల శాసనాలకు సంబంధించి బీఎన్ శాస్త్రి గతంలో ప్రచురించిన శాసనాల కాపీని కూడా ఆయన మీడియాకు విడుదల చేశారు. బీఎన్ శాస్త్రి గుర్తించిన శాసనాలనే ఇతరులు క్లెయిమ్ చేసుకుంటుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు శాసనాల డిజిటలైజేషన్ తప్పనిసరని హరగోపాల్ స్పష్టంచేశారు.