ఇటీవల నాగార్జునసాగర్పై అధికారులపై దౌర్జన్యానికి దిగిన ఏపీ.. మరోసారి బరితెగించింది. ఎన్నికల హడావుడి, ప్రభుత్వ ఏర్పాటు వంటి వాటిలో తెలంగాణ నిమగ్నమై ఉండగా, రాయలసీమ లిఫ్ట్ పనులను దొడ్డిదారిన చేపట్టింది.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసే రాయలసీమ ఎత్తిపోతలను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టింది. అర్ధరాత్రి వేళ ఫ్లడ్లైట్ల వెలుగులో ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తున్నది.
ఈ నిర్మాణం పూర్తయితే కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లనున్నది. రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకుపోవద్దని అటు కేంద్ర జల్శక్తిశాఖ, ఇటు ఎన్జీటీ ఆదేశించింది. వాటిని బేఖాతరు చేస్తూ ఏపీ కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్నది.
Rayalaseema Lift | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల హడావుడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాల్లో తెలంగాణ నిమగ్నమై ఉండగా, ఏపీ ప్రభుత్వం ఇదే అదనుగా అక్రమాలకు తెగబడుతున్నది. పోలింగ్కు ముందురోజే ఒకవైపు నాగార్జునసాగర్ డ్యామ్ను సాయుధబలగాలతో ఆక్రమించుకొన్న విషయం తెలిసిందే. అదీగాక మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జల్శక్తిశాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రాజెక్టు పనులను అర్ధరాత్రి వేళ ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయమై తెలంగాణ అనేకమార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి స్పందన లేకుండాపోయింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల, 80వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డి విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో 2020 మే ఐదో తేదీన 203 జీవోను ఏపీ సర్కారు జారీ చేసింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణాజలాలను తరలించనున్నారు. అదేరీతిన 15.07.2020న పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు రూ.1415 కోట్లతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డు, కేంద్రానికి అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకుపోవద్దని గతంలోనే కేంద్ర జల్శక్తి అదేశానుసారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేసి ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర జల్శక్తి, పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపడుతున్నదని తెలంగాణకు చెందిన ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుకు అనుమతులున్నాయా? లేవా? ప్రాజెక్టు వల్ల ఏపీ, తెలంగాణకు సమన్యాయం జరుగుతుందా? లేదా? శ్రీశైలం జలాలు ఇరు రాష్ర్టాలకు చెందిన అంశమైనందున కేంద్ర జల్శక్తి, పర్యావరణ అనుమతులతోపాటు మరేవిధమైన అనుమతులు కావాల్సి ఉంటుందనే అంశాలను కూడా తేల్చి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక వచ్చేవరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని, ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దానిని సాకుగా చేసుకొని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతోపాటు భారీ యంత్రాలు, వేలాదిమంది కార్మికులతో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులనే ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, దానిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. అందులో కేంద్ర అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి, కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శులతోపాటు ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతివాదులుగా చేర్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను స్వయంగా ఎన్జీటీ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు అభ్యర్థించింది.
ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అబద్ధమేనని ఆ కమిటీ నివేదించింది. దీంతో పర్యావరణ అనుమతులు పొందేవరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీకోసం కూడా ఎలాంటి తవ్వకాలను, పనులను చేపట్టవద్దని ఎన్జీటీ నొక్కిచెబుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కొద్దిరోజులపాటు స్తబ్ధుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమైన సమయాన్ని అదునుగా తీసుకుని కొద్దిరోజుల నుంచి ప్రాజెక్టు పనులను మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి మరీ పనులు చేస్తున్నది.
ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకోసమంటూ ఏకంగా ప్రాజెక్టు పనులనే గతంలో చాలా వరకు పూర్తి చేసింది. కేంద్ర జల్శక్తి మార్గదర్శకాల (2010) ప్రకారం డీపీఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన పనులకన్నా ఎన్నోరెట్ల స్థాయిలో పనులు జరిగాయని ఎన్జీటీ నియమించిన కమిటీనే స్వయంగా ఫొటోలతో సహా గతంలోనే నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ను తవ్వాల్సి ఉండగా, నివేదిక సమర్పించేనాటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. ఫోర్బే ప్రాంతానికి, అప్రోచ్ చానల్కు మధ్య కేవలం 15 మీటర్ల తవ్వకం పనులు మాత్రమే మిగిలి ఉందని తెలిపింది.
అదేవిధంగా అప్రోచ్చానల్ ఫోర్బేను ఇక 237 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉండగా అ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఫోర్బే లోతు 150 నుంచి 180 మీటర్ల వరకు ఉంటుందని, ఫోర్బే గోడలకు సంబంధించి ఇరుపక్కల షాట్క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, ప్రాజెక్టులో భాగంగా 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో, 730 ఫీట్ల లోతుతో ఏర్పాటు చేయాల్సిన పంప్హౌస్కు సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, మొత్తంగా 12 పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో ఇప్పటికే 10 పైప్లైన్ల కోసం 5 మీటర్ల వ్యాసార్థ్యంతో 35 నుంచి 50 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయని, షాట్క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, డెలివరీ సిస్టర్న్ నిర్మాణానికి సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, అక్కడి నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువను కలుపుతూ సుమారు 500 మీటర్ల లింక్ కెనాల్ను సైతం తవ్వారని వెల్లడించింది.
కాంక్రీట్ పనుల కోసం ప్రాజెక్టు సైట్లో రెడ్ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని, కంకర, ఇసుకను కూడా ఇప్పటికే సిద్ధం చేశారని ఆ కమిటీ తెలపడం గమనార్హం. ప్రస్తుతం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి గత కొద్దిరోజులుగా మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అర్ధరాత్రి వేళ సైతం పనులను నిరాటంకంగా కొనసాగిస్తున్నదని తెలుస్తున్నది.
కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులను పొందేవరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ స్పష్టం చేయడంతోపాటు అప్పటికే చేపట్టిన పనుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో జరిగిన పనులను, వాటివల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని, ఏపీ సర్కారు చేసిన ఖర్చును, తదితర సాంకేతిక అంశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. నాలుగునెలల్లో ఆ కమిటీ తమ అధ్యయన నివేదికను అందజేయాలని 2021 డిసెంబర్లో తన తీర్పులోనే స్పష్టం చేసింది. ఇప్పటికి రెండేండ్లు గడచినా ఆ నివేదిక జాడ లేకుండాపోయింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఏపీ ప్రభుత్వం ఆది నుంచీ దుందుడుకుగా ముందుకుపోతున్నా కేఆర్ఎంబీ మాత్రం చోద్యం చూస్తున్నది. లిఫ్ట్ పనులకు జీవో జారీ చేసిన నాటి నుంచి తెలంగాణ సర్కారు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా ఏపీ బేఖాతరు చేస్తూనే ఉన్నది. ఎన్జీటీ ఆర్డర్ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 పనులను చేపడుతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణకు పూనుకొన్నదని, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ను పూర్తిచేసిందని, ఇకనైనా వెంటనే ఏపీని నిలువరించాలని, ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తూ బోర్డుకు పదుల సంఖ్యలో లేఖలు రాసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి స్పందన కరువైంది. ఇప్పటివరకూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న దాఖాలాల్లేవు. కనీసం ఆ వైపు కన్నెత్తి చూసింది కూడా లేదని తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇకనైనా బోర్డు కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.