ఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు వంద ఎకరాల్లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రైతుబంధు సమితి కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్, రేంజ్ ఇన్చార్జి డీఐజీ ఏవీ రంగనాథ్ తదితరులతో కలిసి హరీశ్రావు పరిశీలించారు. బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరానుండటంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, ట్రాఫిక్ అవాంతరాలు కలుగకుండా తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. బహిరంగ సభ కలెక్టరేట్కు సమీపంలోనే ఉండటంతో కార్యాలయ ఉద్యోగులతో సీఎం ప్రత్యేక సమావేశం ఉండదని, వారి వద్దకే సీఎం విచ్చేస్తారని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణాన్ని కలియ తిరిగిన మంత్రులు కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో ఎంపీలు నామా, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎరోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబువుతున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్లీలు, గులాబీ జెండాలతో సుందరంగా తయారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు తదితర కాంగ్రెస్, బీజేపీయేతర నేతలు సభకు హాజరుకానుండటంతో పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు ముఖ్యమంత్రుల కోసం నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రెండు హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. అదేరోజు జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనుండటంతో కార్యాలయాల ఆవశ్యకత, విశాలమైన కార్యాలయాల నిర్మాణం వల్ల జరిగే ప్రయోజనాలను కలెక్టర్ గౌతమ్ ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.