Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సైతం ఎప్పటికప్పు జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో మంత్రి మంత్రి ఆదేశాల మేరకు డెలివరీ సమయం దగ్గర పడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఈ నెల 20 నుంచి 26 వరకు అన్ని జిల్లాలో 327 ఆసుపత్రులకు తరలించారు. గురువారం ఒకే రోజు 176 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. మొత్తంగా 503 మందిని ఆసుపత్రుల్లోని బర్త్ వెయిటింగ్ రూములకు తరలించారు. గర్భిణులతో పాటు అటెండెంట్కు వసతి, భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రస్థాయిలో 24/7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసింది.
దీనికి అనుబంధంగా జిల్లాస్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. మరో వైపు మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు డీపీహెచ్ పరిధిలోని సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు వైద్యారోగ్యశాఖ జారీ చేసింది. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను సైతం రద్దు చేసింది. సిబ్బంది వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది. ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.