మహబూబ్నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణప్రతినిధి): నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రె స్ పార్టీలో రాజకీయం వేడెక్కింది. పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలు పోస్టర్లు, ఫ్లెక్సీల వార్కు తెరలేపారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ అధిష్ఠానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందు లో భాగంగానే.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మల్లు రవి, సంపత్కుమార్ పేరిట పెద్ద సంఖ్యలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా.. నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న డాక్టర్ మల్లు రవి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తన టికెట్కు ఈ పదవి అడ్డుకాకూడదనే రాజీనామా చేశానని, తానే గెలుపు గుర్రాన్ని అని ప్రకటించారు.
కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు రవిది ఒకే కుటుంబం. దీంతో ఖమ్మం, నాగర్కర్నూల్ టికెట్ల కేటాయింపు ఒకదానికి మరొకటి ముడిపడి ఉందనే ప్రచారం కాంగ్రెస్ సర్కిల్స్లో జోరుగా సాగుతున్నది. ఖమ్మం పార్లమెంట్ టికెట్ భట్టి విక్రమార్క సతీమణి ఆశిస్తూ అందు కు అవసరమైన ప్లాట్ఫాంను సిద్ధం చేసుకుంటున్నారు. ఖమ్మంలో భట్టి సతీమణికి టికెట్ ఇస్తే.. నాగర్కర్నూల్లో మల్లుకు టికెట్ నిరాకరించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు కష్టమేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మహబూబ్నగర్ స్థానానికి వంశీచంద్రెడ్డి
ఇటీవల కోస్గిలో జరిగిన సభలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పోటీ చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. టికె ట్ల కేటాయింపు విషయంలో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డికి అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోనే వంశీచంద్రెడ్డి పేరు ప్రకటించారని, నాగర్కర్నూల్కు సంపత్ను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాగా.. మల్లు రవికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్బాబు అండగా ఉన్నారని ఆరోపణలున్నాయి.