ఖలీల్వాడి, సెప్టెంబర్ 24: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘కేంద్ర ప్రభుత్వం.. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం’ అంశంపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు సంఘం భవనంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, ఓయూ జేఏసీ చైర్మన్ భాస్కర్ కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.
బీజేపీ జాతీయ పార్టీ కాదు..
బీజేపీ జాతీయ పార్టీ కాదని, అదో గుజరాతీ పార్టీ అని రాజారాం యాదవ్ అన్నారు. రైల్వే, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు నిధులు ఇవ్వకుండా వాటిని దివాళా తీసేలా చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ప్రధాని మోదీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని ఈడీ, సీబీఐ దాడులు తెలంగాణలోనే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా కేంద్రం పన్నులు పెంచుతున్నదని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ఎనలేని భారం మోపిందని భాస్కర్ విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల ప్రాణాలు తీసిందని మండిపడ్డారు. పసుపుబోర్డు తెస్తానని చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ గడ్డ నుంచే బీజేపీపై తిరుగుబాటు మొదలైందని పేర్కొన్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. వివిధ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఖండించడం, జాతి సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమించడం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై పోరాడటం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు.
వ్యతిరేకిస్తే దోషులుగా చిత్రీకరిస్తున్నారు..
దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇది భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే దోషులుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్పై ఈడీ కేసులు నమోదు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కక్షపూరితంగానే దాడులు
సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేంద్రానికి పోస్ట్మ్యాన్ జాబ్ చేస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే కేంద్రం కక్షపూరితంగా దాడులు చేస్తున్నది. – దత్తాత్రేయ,ఓయూ జేఏసీ అధ్యక్షుడు
రైతులను అణగదొక్కాలని చూశారో
నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అణిచివేయాలని కేంద్రం చూసింది. కానీ రైతుల ఉద్యమానికి జడిసి తోక ముడిచి వెనక్కి తగ్గింది. తెలంగాణలో అభివృద్ధిని చూడలేకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
– కొక్కెర భూమన్న, ఎమ్మార్పీఎస్ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్