కవాడిగూడ, నవంబర్ 13: బీజేపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పి స్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ తొమ్మిదిన్నరేండ్లు గడిచినా దాని ఊసెత్తడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థపాక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు వేముల బలరామ్ మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల డండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జున్ను కనకరాజు మాదిగ, గౌరవ సలహాదారు కొక్కెర భూమన్న ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎమ్మార్పీఎస్, తెలంగాణ మాదిగ హక్కుల డండోరా సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదిగలను మోసం చేసిన మోదీని మాదిగ సమాజం నమ్మె నమ్మబోదన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాదిగ విశ్వరూపసభలో ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత కోసం హామీ ఇస్తారని అనుకుంటే, కమిటీ వేస్తామని చెప్పి హామీ మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. అది మాదిగల సభ కాదని, బీజేపీ సభ అని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో మాదిగలను మందకృష్ణ మాదిగ గంపగుత్తగా బీజేపీకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.