హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డికి తెలంగాణ పీసీసీ పీఠం కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చిచ్చు రగిల్చింది. ముందునుంచి పార్టీకి అంకితమై పనిచేస్తున్న తమనుకాదని కళంకితుడు, టీడీపీ నుంచి వలసొచ్చిన నాయకుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అధిష్ఠానం నిర్ణయంపై గౌరవంతో కొందరు అసంతృప్తిని దిగమింగుకుంటున్నా.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి వంటి నేతలు మాత్రం ఆక్రోశాన్ని వెళ్లగక్కేశారు. మేడ్చల్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై సీనియర్ నాయకులే అంటీముట్టన్నట్టు వ్యవహరిస్తుండటంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. రేవంత్రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించాలా.. వ్యతిరేకించాలా.. తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ఓటుకు నోటు కేసులో పట్టుబడి ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్రెడ్డి తమ అధ్యక్షుడని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ల డం ఎలాగనేది కాంగ్రెస్ నాయకులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరోవైపు ఇన్ని చిక్కులు, పార్టీ పెద్దల సహకారం లేకుండా రేవంత్రెడ్డి ఏం వెలగబెడతారనేది ప్రశ్నార్థకం గా మారింది.
ఓటుకు నోటు తరహాలోనే..:కోమటిరెడ్డి
టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరివరకూ పోటీపడి రేవంత్రెడ్డి చేతిలో భంగపాటుకు గురై న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై భగ్గుమన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ‘కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తున్నా.. వారి నాయకత్వంలో రాబో యే హుజూరాబాద్ ఎన్నికల్లో డిపాజిైట్లెనా తెచ్చుకోవాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించా రు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగిందని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ టీపీసీసీని అమ్ముకున్నారని విమర్శించారు. ఈ విషయం తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందని, త్వరలోనే అన్ని ఆధారాల తో సహా బయటపెడతానని చెప్పారు. టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారిందని, తాను ఇకపై గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనని శపథం చే శారు. కొత్త అధ్యక్షుడితోపాటు కాంగ్రెస్ నాయకులు ఎవరూ తనను కలిసే ప్రయత్నం చేయొద్దన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలు నిర్ణయిస్తారని తెలిపారు. ఈ విషయంలో సోనియా, రాహుల్గాంధీపై విమర్శలు చేయనని చెప్పారు. పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు టీపీసీసీలో గుర్తింపు లేదన్నారు. వెంకట్రెడ్డికే అన్యాయం జరిగిందంటే రానున్న రోజుల్లో మనకూ అదే జరుగుతుందని కార్యకర్తలు అనుకుంటున్నారని చెప్పారు. అందుకే సోమవారం ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని, ప్రజలు, కార్యకర్తల మధ్యే ఉంటూ కొత్తవారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 14 శాసనసభ స్థానాల్లో పార్టీని గెలిపించుకుంటానని పార్లమెంట్లో తన గళం వినిపిస్తానని చెప్పారు.
మర్రి శశిధర్రెడ్డి రాజీనామా..
కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి పార్టీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి ఆయన లేఖ రాశారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమించిన నేపథ్యంలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని, ఎప్పటికీ కాంగ్రెస్మనిషిగానే ఉంటానని లేఖలో పేర్కొన్నారు.