ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 24 : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొందరు ముఖ్యనేతలను వెంట బెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి బయలుదేరారు. పార్టీ కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టగానే గల్లీల్లో మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మం టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యలకు తీవ్రంగా మండిపడిన బీఆర్ఎస్ నేతలు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పోలీసులు నిర్బంధించిన వారిలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు, తోట రామారావు, దండా జ్యోతిరెడ్డి, ఎండీ మక్బూల్, కూరాకుల వలరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కేఎంసీ మాజీ డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళి, మైనారీటీ నేత ఎండీ తాజుద్దీన్, రఘునాథపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు ఉప్పల వెంకటరమణ, కొల్లు పద్మ, షేక్ షకీనా, ఆరెంపుల వీరభద్రం, గొట్టెముక్కుల శ్రీను, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ముత్యాల అప్పారావు, పోలెపొంగు వెంకట్, ఉస్మాన్, వీరేందర్, పాషా, రఫీ, మాటేటి కిరణ్, న్యాయవాది మేకల సుగుణారావు, మట్టా వెంకటేశ్వరరావు, సతీష్, కృష్ణారావు తదితరులున్నారు.