మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పాలమూరును అభివృద్ధిలో నంబర్వన్గా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి పరుగులు పెడుతున్న జిల్లాలో కలహాలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాలమూరులో బతుకు దెరువును చూపించామని చెప్పారు. నిరంతర విద్యుత్తు, సాగునీరు, రైతు సంక్షేమ పథకాలతో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని తెలిపారు.
టీఆర్ఎస్లో చేరికల జోష్
మిడ్జిల్/మదనాపురం/ఉప్పునుంతల/యాదాద్రి, సెప్టెంబర్ 4 : టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకొన్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో చేరుతున్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 10 మంది కాంగ్రెస్ నాయకులు విప్ గువ్వల బాలరాజు, వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి చెందిన 25 మంది యువకులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఆలేరు మున్సిపాలిటీలోని 2, 10వ వార్డులకు చెందిన వంద మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. తుర్కపల్లి మండలం మాదాపూర్కు చెందిన యువజన నాయకుడు గట్టు నిఖిల్ తదితరులు టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.