హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘టీఆర్ఎస్కు కార్యకర్తలే గొప్ప బలం. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఎమ్మెల్యేకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. వారి సాధకబాదకాలు, కుటుంబ పరిస్థితులు చెప్పుకునేలా ఎమ్మెల్యే నడుచుకోవాలి. అందుకు ఆత్మీయ సమ్మేళనాలు వేదిక కావాలి’ అన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్తో మమేకమవుతున్నారు. వారం పదిరోజులుగా కార్యకర్తలను కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొంటున్నారు. పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను ఆరా తీస్తున్నారు. 8 ఏండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను విడమరిచి చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు మొదలు కాగా, త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
8 ఏండ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల్లో చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మండలాలు, గ్రామాలు, డివిజన్లు, వార్డుల వారీగా వివరిస్తున్నారు. 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించాలని, ఆ జాబితాను తనకు పంపాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో చురుకైన కార్యకర్తల ఎంపిక విషయంలో ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకొంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితా, ఆయా పనులకు వెచ్చించిన వ్యయం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రతి కార్యకర్తకు తెలిసేలా ప్రగతి నివేదికను రూపొందించే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు.
రాష్ట్ర ప్రగతికి మోదీ సర్కారు సృష్టిస్తున్న అడ్డంకులను పార్టీ క్యాడర్కు అర్థమయ్యేలా ఆత్మీయ సమ్మేళనాల్లో వివరిస్తున్నారు. ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని వివరించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ పార్థసారథిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఎంపీ నామా నాగేశ్వర్రావు అవగాహన కల్పించారు. రాష్ర్టం పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్నీతిని ఎండగట్టారు. ఇదే తరహాలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా ఎమ్మెల్యేలు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్తో మమేకం అవుతున్నారు. ఎమ్మెల్యే రోజంతా తమతోనే కలిసి ఉండటంతో గ్రామీణ నియోజకవర్గంలోని మండలాలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, పట్టణ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆయా స్థాయిల్లో పార్టీ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృతంలో నిర్వహించిన సమ్మేళనానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులు పాల్గొని నియోజకవర్గ స్థితిగతులతోపాటు రాష్ర్ట రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు.