ఖమ్మం : దేశాన్ని దోచుకుతింటున్న వారికి ప్రధాని మోదీ ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు యత్నం చేస్తూ మోదీ ప్రజలకు నీతులు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా అన్ని జిల్లాల్లో సీపీఐ నేతలను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులను తిట్టడం ఫ్యాషన్గా మారిందని దుయ్యబట్టారు. రామగుండం ఎరువుల కర్మాగారం రెండు సంవత్సరాలు క్రితమే ప్రారంభమయితే ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్మకానికి పెట్టారని నిలదీశారు. ఎరువుల కర్మాగారం అమ్మరని గ్యారంటీ లేదని అన్నారు.ప్రైయివేటీకరణకు రూ. 6 లక్షల కోట్లు కేటాయించడం మోదీ ఫాసీజాన్ని తెలియజేస్తుందని ఆరోపించారు.
దేశంలోద్రవ్యోల్బణం వందశాతం పెరిగిందని తెలిపారు. దేశంలో శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు తవ్వాలని డిమాండ్ చేశారు. అరబిందో కంపెనీ కోయగూడెం ఓసీని దక్కించుకున్నారని, ఇది తప్పు అయితే తనను ఉరి తీయాలని లేదా మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒరిస్సా లో చంద్ర గుప్తా మైన్ ను రాజా గోపాల్ రెడ్డి కి అప్పగించి సింగరేణి ప్రైవేటీకరణకు అడుగులు వేయడం కాదాని ప్రశ్నించారు. కొయ్యగూడెం జేవీర్ ఓపెన్ కాస్ట్లను ప్రైవేట్పరం కానివ్వకుండా పోరాటం చేస్తామని ప్రకటించారు. శ్రావణి పల్లి కల్యాణ్ ఖని, మందమర్రి మైన్ లను ప్రైవేటు పరంచేయనున్నారని ఆరోపించారు. మోదీ ని ఎదుర్కొనడానికి ఎవరినైనా కలుపుకుంటామని స్పష్టం చేశారు.