ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తాం. ప్రజలెవరూ చార్జీలు చెల్లించొద్దు.
– ఉత్తమ్ (అక్టోబర్ 10, 2020)
వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఎల్ఆర్ఎస్ను మేం రద్దు చేస్తాం.
-మీడియాతో భట్టివిక్రమార్క ,సీతక్క (అక్టోబర్ 6, 2020)
ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం.
-కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (అక్టోబర్ 6, 2020)
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు మర్చిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ఉచితంగా చేస్తామని, ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దని పీసీసీ చీఫ్గా నాడు ఉత్తమ్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఉత్తుత్తివే అయ్యాయి. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని నాటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రకటించారు.
అధికారం చేతికి అందగానే నేతలు ఈ మాటలను అటకెక్కించేశారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది. ఎల్ఆర్ఎస్ ద్వారా పేదలపై భా రం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన 25 లక్షల మంది నుంచి మార్చిలోగా రూ. 20 వేల కోట్లకుపైగా వసూలు చేసేందుకు ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి వారిపై కనీసం లక్ష రూపాయల భారం పడనుంది.
ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయండి: రేవంత్
లక్షలాదిమంది దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.31 ఆగస్టు 2020 నుంచి అక్టోబర్ 31 వరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెలలపాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 25.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్కు సంబంధించిన దరఖాస్తుదారులు రూ. 1000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు రూ. 10 వేలు చెల్లించారు. ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైనట్టు రిజిస్ట్రేషన్శాఖ అధికారులు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం లక్షలాది కుటుంబాలకు మేలుచేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అప్పటి నిబంధనల ప్రకారమే లే అవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31 లోగా లే అవుట్ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీచేశారు.