హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు జోన్-II భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయవాదులకు కల్పించిన సీటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాసి నిరసన వ్యక్తంచేసింది. రాజేంద్రనగర్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బార్ సభ్యులకు తగిన గౌరవం లభించలేదని, అది తమకు నిరాశ కలిగించిందని అసోసియేషన్ పేరొంది. అసోసియేషన్ కమిటీ సభ్యులను బారికేడ్ల వెనుక కూర్చోబెట్టడం వారి హోదాకు అవమానకరమని అభిప్రాయపడింది. న్యాయవాదుల ప్రతినిధులుగా ఎన్నికైన కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వకపోవడం ద్వారా సంస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని పేరొంది. ఇది ప్రత్యేక హకుల కోసం కాదని, కానీ సంస్థ ప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలనే అంశమని స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు కూడా వారి స్థాయికి తగ్గ సీటింగ్ కల్పించలేదని తెలిపింది.
సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది సీనియర్ న్యాయవాదులు కార్యక్రమం పూర్తికాకముందే వెళ్లిపోయారని పేర్కొంది. ఈ ఘటన రిజిస్ట్రీ నుంచి ఆశించే వృత్తిపరమైన మర్యాద లోపాన్ని ప్రతిబింబిస్తున్నదని పేరొంది. ఈ పరిణామాలు న్యాయవాదుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయని, బార్ గౌరవానికి భంగం కలిగించిన చర్యగా భావిస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితమైన ప్రొటోకాల్ విధానాన్ని అమలుచేయాలని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తగిన గుర్తింపు ఇవ్వాలని, సీనియర్ కౌన్సిల్స్ను గౌరవప్రదంగా చూసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.