భూత్పూర్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పట్ల చిన్నచూపు చూస్తున్నదని జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి న్యాయవాదుల పాదయాత్రను సోమవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల చట్టం అమలు చేయాలని కోరుతూ గత నవంబర్ 9న అలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి 10మందితో జోగుళాంబ టు హైదరాబాద్కు పాదయాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. నవంబర్14వ తేదీ నాటికి భూత్పూర్ పట్టణ కేంద్రానికి చేరుకున్న అనంతరం దేవరకద్ర, మహబూబ్నగర్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వంశీకృష్ణ న్యాయవాదుల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు.
అధికార పా ర్టీ ఎమ్మెల్యేల హామీ మేరకు పాదయాత్రను భూత్పూర్ చౌరస్తా వరకే నిర్వహించి చేసి విరమించినట్టు తెలిపారు. వారం, పది రోజుల్లో న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 101 రోజులైనా ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించక పోవడంతో మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
వంద రోజుల వ్యవధిలో సీఎంని అపాయింట్మెంట్ కోరితే దొరకలేదని, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వంశీకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులో రావడం లేదని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ఈ నెల 27న హైదరాబాద్కు చేరుకొని సీఎం కి వినతిపత్రం అందజేస్తామని తెలిపా రు. అలంపూర్, జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్కర్నూల్, మక్తల్, నారాయణపేట్, కోస్గి, ఆత్మకూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.