హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): నేరాలను ఛేదించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ‘లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్’ను శనివారం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, సైబరాబాద్ పోలిస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని, ఇది గత ఏడాది అమెరికా జీడీపీలో మూడవ వంతుతో సమానమని చెప్పారు. ఇంతటి క్లిష్టమైన సైబర్ నేరాలను నిపుణుల సహకారంతో తెలంగాణ పోలీసులు ఛేదించగలుగుతున్నారని అన్నారు. బాధితులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ బ్రైటింగ్ స్టార్స్ అని ప్రశంసించారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడితే 1930కి ఫిర్యాదు చేయాలి : జయేశ్రంజన్
దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన లా ఎన్ఫోర్స్మెంట్ సిసో కౌన్సిల్ తెలంగాణలో సైబర్ సెక్యూరిటీకి ‘దీపస్తంభం’ అని జయేశ్రంజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిదీ డిజిటలైజేషన్ అవుతున్నదని, డిజిటల్ వినియోగదారులు పెరిగినప్పుడు సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు వెంటనే 1930 లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గడిచిన ఏడాది కాలంలో సైబర్ నేరాలు 300 శాతం పెరిగాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొ ని మన డిజిటల్ స్పేస్, ప్రభుత్వ సంస్థలు, కీలకమైన పరికరాలు, పరిశ్రమలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్నాయక్, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, అన్ని జోన్ల డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, రమేశ్ కాజా తదితరులు పాల్గొన్నారు.