హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో శాంతి ఎంతో అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. విద్వేషాలు లేనంతకాలం శాంతి వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. శనివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ‘ఇండియా-చైనా మిత్ర మండలి సంఘం’ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. కొన్ని దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం బాధాకరమన్న ఆయన.. దీనివల్ల విధ్వంసం తప్ప మరేమీ ఉండదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కాబట్టే తెలంగాణలో పెట్టుబడులకు ప్రపంచదేశాలు తరలివస్తున్నాయని వివరించారు. ఇరు దేశాల ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా చైనా-ఇండియా ప్రజలు మాత్రం చిరకాల మిత్రులని తెలిపారు. ఆధునిక చైనా సృష్టికర్త డెంగ్ జియో పింగ్ బాటలోనే సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని ప్రశంసించారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన షహీద్ భగత్సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ జగన్మోహన్సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో చైనా అవలంబిస్తున్న విధానాలు మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అణుశక్తి కలిగిన దేశాల మధ్య వైరం మానవ వినాశానికి దారి తీస్తుందని హెచ్చరించారు. భారత్, చైనా మైత్రి చేసుకుంటే ప్రపంచలోనే బలమైన ఆర్థికశక్తి, సూపర్ పవర్ దేశాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఐసీఎఫ్ఏ అధ్యక్షుడు కే పర్వత్రెడ్డి, ఇండియా-చైనా మిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు భాసరన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎం మోహన్రెడ్డి, విజయేందర్రావు తదితరులు పేర్కొన్నారు.