హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలి? ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి? ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి? ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది? అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా సర్కారు స్కూళ్లల్లో చదివేవారు ఇలాంటి సమస్యలతో సతమతమవుతారు. అలాంటి విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందుకోసం ‘తెలంగాణ కెరీర్ గైడెన్స్’ పోర్టల్ ద్వారా అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. యూనిసెఫ్ ఇండియా, ఆస్మాన్ ఫౌండేషన్ సంయుక్తంగా రూపొందించిన ఈ పోర్టల్ను ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న వారి కోసమే రూపొందించారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సమస్త సమాచారాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పొందుపరిచారు. విద్యార్థుల అభిరుచి, ఆసక్తులను అనుసరించి ముఖ్యమైన అంశాలన్నింటినీ ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్క క్లిక్తో విద్యార్థులు తమకు కావాల్సిన సమస్త సమాచారాన్ని పొందవచ్చు.
telanganacareerportal.com విద్యార్థులు ముందుగా పోర్టల్లోకి వెళ్లి ఐడీ, పాస్వర్డ్ను జనరేట్ చేసుకోవాలి. ఐడీ, పాస్వర్డ్లతో లాగిన్ అయ్యి పోర్టల్లోకి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సిన సమస్త సమాచారం లభిస్తుంది. ఐడీ కోసం విద్యార్థులు తమ టీచర్తో పాటు,
హెచ్ఎంలను సంప్రదించాలని యూనిసెఫ్ అధికారులు సూచిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలన్న దానిపై తేల్చుకోలేకపోతారు. ఈ దశలో కన్ఫ్యూజన్కు గురవుతారు. ఇలాంటి వారి కోసమే కెరీర్ గైడెన్స్ పోర్టల్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చాం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విద్యార్థులు కన్ఫ్యూజన్కు తావులేకుండా క్లారిటీకి వచ్చేలా సమాచారాన్ని పొందుపరిచాం. విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష.
– పీ సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి