హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నిరుడు కొత్తగా 148 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 103 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించామని, వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఇంజిన్ల సంఖ్య 45 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. త్రీఫేజ్ ఇంజిన్ల శక్తి (హార్స్పవర్) అధికంగా ఉంటుందని, ఈ ఇంజిన్ సాయంతో పూర్తి నిడివి కలిగిన ప్యాసింజర్ రైలును ఎలాంటి ఆటంకం లేకుండా గంటకు 130 కి.మీ. వేగంతో నడపవచ్చని వివరించారు. సరుకు రవాణా సమయాన్ని తగ్గించేందుకు కూడా ఈ ఇంజిన్లు దోహదపడతాయని తెలిపారు.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుపుతున్న 16 ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చెన్నై-సంత్రాగచ్చి, భువనేశ్వర్-చెన్నై, ఎర్నాకులం-బరంపూర్, బెంగళూరు-కలబురిగి, నాగర్సోల్-దిబ్రూగఢ్ తదితర స్టేషన్ల మధ్య నడుస్తున్న ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి జూన్ 15 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని వివరించారు.