హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది. రైజింగ్ తెలంగాణ అని రేవంత్రెడ్డి సర్కార్ చెప్తున్నప్పటికీ ఆ ఎదుగుదల అప్పుల్లో తప్ప ఆదాయ వృద్ధిలో కనిపించడం లేదు. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ గణాంకాలను గమనిస్తే.. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కంటే అప్పులపైనే ప్రభుత్వం ఎకువగా ఆధారపడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ‘అప్పు చేసి పప్పుకూడు’ అనే చందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్ల మేరకు కొత్త అప్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇందులో బహిరంగ మారెట్ నుంచి రూ.73,383 కోట్లు, కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు తీసుకుంటామని బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, అక్కడితో ఆగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అంచనాలకు మించి రూ.85,840 కోట్ల అప్పు చేయడమే ఈ అనుమానాలకు కారణం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు మించి ఎన్నడూ అప్పులు తెచ్చిన దాఖలాలు లేవు. అలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించిన రుణాలు రూ.49,618 కోట్లు. కానీ, గత రెండేండ్లలో కాంగ్రెస్సర్కార్ రెట్టింపు స్థాయి లో అప్పులు తేవడం ఆందోళనకరం.
అప్పులతోనే హైదరాబాద్ అభివృద్ధి
హైదరాబాద్ను విశ్వనగరం అభివృద్ధి చేయడంపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్తున్నట్టు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను నేరుగా ఖర్చు చేయకుండా సంబంధిత సంస్థలకు అప్పుగా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుం డా రూ.1,450 కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రతిపాదించింది. మెట్రో రైల్ రెండో దశ కోసం నేరుగా రూ.600 కోట్లు ఇస్తామని ప్రకటించి, మరో రూ.500 కోట్లు రుణంగా మంజూరు చేసింది. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో కూడా ఎకువ భాగం రుణాల ద్వారానే సమీకరించే అవకాశం ఉన్నది.
బడ్జెటేతర అప్పుల ముసుగులో..
ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా చేసే బడ్జెటేతర అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. బడ్జెట్లో చూపించే గణాంకాలు కాకుండా విడిగా వివిధ సంస్థల పేరుతో చేస్తున్న ఈ అప్పులు భవిష్యత్ తరాలపై కోలుకోలేని భారాన్ని మోపనున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ అప్పులతోనే నెట్టుకొస్తున్న ఈ విధానం రాష్ట్ర ఆర్థిక భద్రతకే ముప్పు గా మారింది. అభివృద్ధి పనులకే కాకుం డా ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సైతం రుణాలు తెచ్చుకోవాల్సిన దుస్థితికి రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దిగజార్చిందనినిపుణులు పేర్కొంటున్నారు.