కొడకండ్ల, ఫిబ్రవరి 27: పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అశ్రునయనాల మధ్య ముగిశాయి.ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమె 4 రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి హైదరాబాద్లోని నిమ్స్లో మరణించింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గిర్నితండాకు తీసుకురాగా, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్ గ్రామానికి చేరుకొని ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఓదార్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. తనకు, సత్యవతి రాథోడ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి, వివరాలు తెలుసుకొన్నారని.. కుటుంబంలో వారి చదువుకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ సైతం బహిరంగ సభ సాక్షిగా ప్రీతికి న్యాయం చేస్తామని ప్రకటించినట్టు గుర్తుచేశారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, తాను, తన కార్యకర్తల నుంచి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ప్రీతి మరణాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తిచేశారు. ప్రీతి కుటుంబంతో తనకు అనుబంధం ఉన్నదని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కాగా, ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది ముమ్మాటికి హత్యేనని ఆమె తండ్రి నరేందర్ నాయక్ ఆరోపించారు. దీనిపై పోలీస్లు పూర్తి విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.