నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తె లంగాణ): వ్యవసాయం, దాని అనుబంధ రం గాల పురోభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నది. సాగునీటి కల్పన, నిరంతర విద్యుత్త్తు, రైతు బంధువంటి పథకాలతో వరిసాగులో ఊహాకందని రీతిలో అగ్రగా మి దిశగా ముందుకు సాగుతున్నది. ఇదే సమయంలో వరి సాగుపై ఆధారపడిన రైస్మిల్లు ఇండస్ట్రీ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏటేటా స్థిరంగా సాధిస్తున్న పురోభివృద్ధితో అధునాతన రైస్మిల్లులకు అంకురార్పణ జరుగుతున్నది. దేశంలోనే భారీ సామర్థ్యంతో నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లు ఏర్పాటైంది. గంటకు 32 టన్నుల మిల్లింగ్ సామర్థ్యంతో బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. రూ.100 కోట్ల పెట్టుబడితో హాలియా సమీపంలో ఏర్పాటైన వజ్రతేజ రైస్మిల్లు ప్రస్తుతం రైస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
రాష్ట్ర సర్కారు భరోసాతోనే భారీ మిల్లు
ఈ రైస్మిల్లును వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నల్లగొండ జిల్లా హాలియా మండల పరిధిలోని పాలెం గ్రామ శివారులో జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి ఏర్పాటు చేశారు. మదారిగూడెం గ్రామానికి చెందిన చిట్టిపోలు యాదగిరి 1999లో రైస్ మిల్లు ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. కొందరు మిత్రులతో కలిసి కనకమహాలక్ష్మి రైస్మిల్లును ఏర్పాటు చేశారు. సమైక్య రాష్ట్రంలో ప్రోత్సాహం, ధాన్యం కొనుగోళ్లకు సరైన వ్యవస్థ లేక అనేక ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమ అనుమతులు మొదలుకొని వచ్చిరాని కరెంటు ఆటంకంగా మారేది. దాంతో పెద్దగా లాభాలు లేవు. రా రైస్ ఉత్పత్తి కంటే ఎక్కువగా సీఎంఆర్పై ఆధారపడే మిల్లులు నడిపేవారు. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో ధాన్యం దిగుబడులు ఊహించని విధంగా పెరిగాయి. పైగా పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ ఎంతో ఉపయుక్తంగా మారింది. నిరంతర కరెంటు అదనపు బలమైంది. ప్రభుత్వ విధానాల్లో స్పష్టతతోపాటు పరిశ్రమకు కల్పిస్తున్న భరసాతోనే దేశంలోనే అతి పెద్ద మిల్లు ఏర్పాటుకు అంకురార్పణ చేసినట్టు యాదగిరి తెలిపారు.
క్వాలిటీ రా రైస్ ఉత్పత్తి
దేశంలోనే నాణ్యమైన ధాన్యం రాష్ట్రంలో పండుతుండటంతో వజ్రతేజ రైస్ ఇండస్ట్రీ రా రైస్ ఉత్పత్తిపైనే దృష్టి సారించింది. తన సొంత బ్రాండ్ ‘వజ్రతేజ’ పేరుతోనే బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నేరుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల నుంచి 80 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి వరకు విజయవాడ, వైజాగ్తోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ యజమాన్యం తెలిపింది. రాబోయే కాలంలో విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ సన్నాలకు అందులోనూ నల్లగొండ సన్నాలకు మంచి డిమాండ్ ఉన్నట్టు యజమానులు తెలిపారు.
టీఎస్ఐపాస్ తోడ్పాటు
తెలంగాణ సర్కారు రూపొందించిన టీఎస్ఐపాస్ వ్యవస్థ వజ్రతేజ రైస్ ఇండస్ట్రీకి ఎంతో ప్రోత్సాహానిచ్చింది. టీఎస్ఐపాస్ ద్వారా ఒక్క నెలలోనే అన్ని అనుమతులు ఇంటికే వచ్చాయి. అందుకే ఏడాదిన్నరలో ఇంత పెద్ద మిల్లును నిర్మించారు. 2021 మే 3న మిల్లు నిర్మాణానికి భూమి పూజ చేయగా.. 2022 నవంబర్ 11న మిల్లులో ఉత్పత్తిని ప్రారంభించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రభుత్వ విధానాలను చూడలేదని, అది కేవలం సీఎం కేసీఆర్ చిత్తుశుద్ధి వల్లనే సాధ్యమైందని మిల్లు యజమాన్యం గర్వంగా చెబుతున్నది.
తెలంగాణ సర్కారు కల్పించిన విశ్వాసంతోనే సాగునీటి వి ధానం, నిరంతర కరెంటుతోపాటు మౌలిక వసతుల కల్పన, అనుమతుల సులభతరం లాంటివే ఇంత పెద్ద మిల్లు ఏర్పాటుకు మమ్నల్ని పురిగొల్పాయి. తెలంగాణ సర్కారు కల్పించిన విశ్వాసంతోనే అత్యాధునిక టెక్నాలజీతో మిల్లును ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పండే వరితో నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. దక్షిణ భారత రాష్ర్టాలన్నింటికీ నాణ్యమైన సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాం. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు, ఐటీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
–చిట్టిపోలు యాదగిరి, వజ్రతేజ రైస్ ఇండస్ట్రీ ఎండీ
రైస్మిల్ ప్రత్యేకతలు
మిల్లు పేరు: వజ్రతేజ
సామర్థ్యం: గంటకు 32 టన్నుల మిల్లింగ్
పెట్టుబడి: రూ. వంద కోట్లు
టెక్నాలజీ: ఏపీటీఐ టెక్నాలజీ
పనితీరు: 24గంటలు, 365 రోజులు
కరెంట్: ధాన్యంపొట్టుతో 1.2మెగావాట్ల పవర్ జనరేటర్
స్టోరేజీ: ఆరు భారీ సైలోస్లో 15 వేల మెట్రిక్ టన్నులు స్టోర్