హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి కొనియాడారు. ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల ముగింపు సందర్భంగా మహిళా వికలాంగుల సాధికారత సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం పేద దివ్యాంగులకు దుప్పట్లు, వస్ర్తాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న సంస్థలకు, విభిన్న ప్రతిభావంతులకు అవార్డులను ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో నారా నాగేశ్వర్రావు, నల్గొండ శ్రీనివాస్, మహేశ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లతాచౌదరి, జీవన్జ్యోతి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.