మిడ్జిల్, జూలై 8 : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగు పరీవాహక ప్రాంతంలో నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు యత్నిస్తున్నారు. ఇదే విషయమై భూ యజమాని బాలకృష్ణారెడ్డితోపాటు మరో రైతు బుధవారం మిడ్జిల్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు.
కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్లు 87, 89, 91, 96, 98, 99లో సుమారు 110 ఎకరాల భూమిలో ఇసుక నిల్వలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ అనుమతులతో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అవసరాలకు ఇసుక తరలించే వారని తెలిపారు. ఆ అనుమతులు 2025 నవంబర్ 29 తేదీ నాటికి ముగిసాయని, మిగిలిన ఇసుక నిల్వలు తమ భూమిలోనే నిల్వ ఉంచినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో పలువురు ట్రాక్టర్లతో వాగు ప్రాంతానికి చేరుకొని నిల్వ ఇసుకను తరలించేందుకు యత్నించారని ఆరోపించారు.