Rangareddy | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్ ఆఫీసులో ధరణి ఆపరేటర్గా కొనసాగుతున్న వ్యక్తి లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. తహసీల్ కార్యాలయంలో ధరణి వ్యవహారాలు చూసే ప్రేమ్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నాడంటూ రాజు అనే బాధితుడు ఈ నెల 20న కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. గత జనవరి నెలలో తాను భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నానని బాధితుడు కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రేమ్ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని వాపోయాడు. డబ్బుల కోసం సదరు ధరణి ఆపరేటర్ పలు మార్లు తనకు పోన్ చేసి వేధించాడని, డబ్బు విషయమై వాట్సాప్లో చాట్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను స్క్రీన్ షాట్ చేసి కలెక్టరేట్లో చూపించాడు. రిజిస్ట్రేషన్ కోసం రూ.40 వేలు డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. తాను రూ.20 వేలు ఇస్తానంటే ఒప్పుకోలేదని తెలిపాడు. ‘డబ్బులు తహసీల్దార్కు ఇవ్వాల్సి ఉంటుందని, అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సార్ ఫైల్ బ్లాక్ చేస్తానంటున్నారు.. నీ ఇష్టం మరి’.. అంటూ భయపెట్టడంతో తాను ‘రూ.30 వేలు ఇస్తా, అర్థం చేస్కో’.. అని బతిమాలితే ‘సరే ఇప్పుడు నేను బయటికి వస్తా ఆ డబ్బులు ఇచ్చెయ్ నేను సార్కు ఇచ్చేస్తా. నెక్ట్స్ టైం మొత్తం ఇచ్చేయాలి.. లేదంటే ఎమ్మార్వో అసలే ఒప్పుకోడు’ అంటూ వాట్సాప్ చాట్కు సంబంధించి స్క్రీన్ షాట్లో స్పష్టంగా తెలుస్తున్నది. తనలాంటి మోసపోకుండా ఉండాలంటే ధరణి ఆపరేటర్ ప్రేమ్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు రాజు విజ్ఞప్తి చేశాడు.