ఘట్కేసర్ రూరల్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దంపతులపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఠాణాలో శుక్రవారం భూకబ్జా కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ బీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 796లో పీర్జాదిగూడ బుద్ధానగర్కు చెందిన ముచ్చర్ల రాధికతోపాటు మరికొంత మందికి 150 గజాల చొప్పున ప్లాట్లు ఉన్నాయి.
అయితే తమ ప్లాట్లను కబ్జాచేసి, వాటి చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారని ఆరోపిస్తూ బాధితురాలు రాధికతోపాటు మరో 8 మంది ఈ నెల 23న పోచారం ఐటీసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఈవో సూర్యదేవర నీలిమ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి మధుకర్రెడ్డి లపై 427, 447, 506సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.