హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల కారణంగా నిలిపివేసిన పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిశాకే ప్రారంభించాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకొని పెండింగ్ దరఖాస్తులకు భూకేటాయింపులు చేపట్టాలని పలువురు కోరినా, టీఎస్ఐఐసీ మాత్రం కోడ్ ముగిశాకేనని స్పష్టంచేసింది. రూ.200 కోట్లు.. అంతకన్నా ఎక్కువ పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి అవకాశాలను సృష్టించే పరిశ్రమలకు రాష్ట్ర క్యాబినెట్ ద్వారా అనుమతి లభిస్తుంది. అంతకన్నా తక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోనే అనుమతులు జారీచేస్తారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో టీఎస్ఐఐసీ ప్రతి వారం భూకేటాయింపులు చేపట్టేది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రతి శుక్రవారం దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసేది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, ఇంటర్యూల నిర్వహణ ప్రక్రియలో మరింత జాప్యం జరిగింది. దీంతో భారీగా దరఖాస్తులు పేరుకుపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య రెండు-మూడు వారాలు ఇంటర్వ్యూలు నిర్వహించినా ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల కోడ్ రావటంతో రెండు నెలలుగా భూకేటాయింపు నిలిచిపోయింది.
బీఆర్ఎస్ సర్కారు పాలనలో టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు జారీచేస్తూ టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించింది. అయితే, కాంగ్రెస్ సర్కారు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నవాళ్లు కొత్త పాలసీలో రాయితీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఆరు గ్యారెంటీల అమలుకే సర్కారు వద్ద నిధులు లేవు. అలాంటప్పుడు పరిశ్రమలకు రాయితీలు కల్పించే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.