హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రాయదుర్గంలో ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన భూముల వేలంలో రూ.269కోట్లు పలికింది. 5.38 ఎకరాల పీ2 ప్లాట్ వేలంతో ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. రిజర్వు ధర కంటే 52.3% అధిక ధర పలికినట్టు టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక తెలిపారు. ప్లాట్ పీ1 వేలంలో ఎకరా రూ.264 కోట్లు ధర పలుకగా.. మొత్తం 1,386 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు.
ఇందులో వేలం విలువలో 25% తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకున్నట్టు తెలిపారు. పీ1, పీ2 ప్లాట్లు రెండు కలిపి మొత్తం 10.63 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా.. ప్రభుత్వానికి మొత్తం రూ.2,883.22 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు వేలాల్లోనూ ఎకరాకు రూ.260 కోట్లకు పైగా ధర పలుకడం రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారుల్లో ఉన్న ఆసక్తికి అద్దం పడుతున్నదని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతా ల్లో ఉన్న భూములకు ఎంతటి డిమాండ్ ఉన్నదో ఈ ధరలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.