నిజామాబాద్ : మేగిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram project) మొత్తం కొట్టుకుపోయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి( MLA Prashanth Reddy) మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా నీటిని ఎత్తిపోయకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా సముద్రంలోకి పోయేలా చేసి రైతులను ఏడిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మి, కాకతీయ కాలువలకు(Kakatiya canal) వేముల బుధవారం నీటిని విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు సాగు, తాగు నీటి ఇబ్బంది ఉండొద్దని ప్రాణహిత, గోదావరి కలిసే చోట మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారన్నారు. రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా రూ.4వేల కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారని తెలిపారు. అందులోని 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపి కాళేశ్వరం పూర్తిగా కొట్టుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసి రైతులను ఆగం చేసిందన్నారు.
పైగా నీళ్లను ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీళ్లు ఉన్నందున గుత్ప, అలీసాగర్ లిఫ్ట్లను నడిపించి బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని చెరువులు నింపాలని, ఆయకట్టుకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వందలాది రైతులతో కలిసి వచ్చి మేమే మోటార్లు ఆన్ చేస్తామని వేముల అల్టిమేటం జారీ చేశారు.