హైదరాబాద్: లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లేవని, ఇసుక కదలికల వల్లే బరాజ్లోని 7వ బ్లాక్లోని పియర్లు స్వల్పంగా కుంగాయని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీబరాజ్ కుంగుబాటు ఘటనపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో శుక్రవారం రజత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బరాజ్ కుంగుబాటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.
సమావేశం అనంతరం రజత్కుమార్ మాట్లాడుతూ.. ఇసుక కదలికల వల్లే లక్ష్మీబరాజ్ కుంగుబాటుకు గురయిందని, నిర్మాణ లోపాలుగానీ, డిజైన్లో లోపాలుగానీ, నిర్వహణ లోపాలుగానీ లేవని స్పష్టం చేశారు. పియర్ల కుంగుబాటుకు సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందానికి సాంకేతిక వివరాలను అందజేశామని ఆయన వెల్లడించారు. త్వరలోనే బరాజ్ పునరుద్ధరణ పనులను చేపడుతామని రజత్కుమార్ తెలిపారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, తదుపరి పియర్స్ వద్ద నీరు లేకుండాచేసి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు.
ఇన్వెస్టిగేషన్ అనంతరం వాటికి అనుగుణంగా నివేదికలను రూపొందించుకుని బరాజ్ పునరుద్ధరణ పనులను కూడా వెంటనే ప్రారంభిస్తామని రజత్ కుమార్ వివరించారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీడీవో సీఈ మోహన్కుమార్, ఈఎన్సీ అనిల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతోపాటు ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.