హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. పేద, ధనిక తేడాలేకుండా కడుపు నిండేందుకు ఏదో ఒకటి తినేస్తున్నారు. కానీ, అవి శరీరానికి తగినంత పోషకాలను అందించడం లేదు. సరైన పోషకాహారం లేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో లోపిస్తున్న పోషకాలు వారీ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. జాతీయ పోషకాహార అధ్యయన సంస్థ (ఎన్ఐఎన్) దేశవ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు, పోషకాలపై పరిశోధించి దేశంలోని ఆయా ప్రాంతాలవారీగా సమతుల ఆహార విలువను గుర్తించింది. ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండగా, మైక్రో న్యూట్రియన్లు లోపించాయని సర్వేలో వెల్లడైంది.
8 రాష్ర్టాల్లో ఐరన్ లోపం
ఆహారంలో పోషకాలు లోపిస్తే వచ్చే రుగ్మతలపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 18 ఏండ్లు నిండిన పురుషులకు సగటున ప్రతిరోజు 8.7 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది. 19-50 ఏండ్ల లోపు మహిళలకు 14.8 మిల్లీగ్రాముల ఐరన్ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, దేశంలోని 8 రాష్ర్టాల్లో ఐరన్తో కూడిన ఆహారం ఉండటం లేదని తేలింది. దీంతో ఎనీమియా(రక్తహీనత) బారిన పడుతుండగా హార్మోనల్ సమస్యలు తలెత్తుతున్నట్టు వెల్లడైంది. అస్సాంలో 70 శాతం, ఒడిశాలో 55 శాతం, మధ్యప్రదేశ్లో 45.4, గుజరాత్లో 33.8, తమిళనాడులో 23.9, పశ్చిమ బెంగాల్లో 20.2, తెలంగాణలో 16.8, మేఘాలయలో 12.1 శాతం మంది ఎనీమియా బారినపడ్డారని నివేదికలో పేర్కొన్నది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ఎనీమియా సోకిన వారి కంటే బీ12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 24.6 శాతంగా అధికంగా ఉన్నదని గుర్తించారు.
కార్బోహైడ్రేట్లే ఎక్కువ..
జాతీయ పోషకాహార సంస్థ 2020-21లో దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో ఉన్న పోషకాలను నివేదించింది. ఈ రిపోర్టు ప్రకారం పట్టణ ప్రాంతవాసులు 1,943 కిలో క్యాలరీలను ప్రతిరోజు తీసుకుంటుండగా, ఇందులో 289 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు 51.6 గ్రాములు, ప్రోటీన్లు 55.4 గ్రాములను ఆహారంలో తీసుకొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2,081 కిలోక్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్లు 368గ్రాములు, కొవ్వులు 36 గ్రాములు, ప్రోటీన్లు 69 గ్రాములుగా ఉన్నట్లుగా తేలింది.