హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్లు కావస్తున్నదని, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కార్మికులకు చేతినిండా పని దొరికే పరిస్థితి లేకుండా పోతున్నదని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి, టెస్కోకు పాలక మండలిని నియమించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేతను సర్వనాశనం చేసే విధానాలను మానుకోవాలని, జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్చేశారు. భవిష్యత్తులో బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే చీరలను చేనేత మగ్గాలపై నేయించి, పంపిణీ చేయాలని కోరారు.