చౌటుప్పల్, అక్టోబర్ 23: ఆటోరంగ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో నిర్వహించిన టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం 714 జీవో తెచ్చి ఆటో కార్మికుల నుంచి రూ.లక్షలు దండుకున్నదని మండిపడ్డారు.
తెలంగాణలో ఈ జీవోను సీఎం రద్దుచేసి ఆటో కార్మికులకు ఆపన్న హస్తం అందించారని గుర్తుచేశారు. ఆటో కార్మికులకు రోడ్డు రవాణా లైఫ్ టైం టాక్స్ రద్దు చేయడంతో పాటు, రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఆటో కార్మికులంతా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి పీ నారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పాండు, శివశంకర్, యాట కృష్ణ పాల్గొన్నారు.