హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హోలీ రోజు రంగులు చల్లుకోవడం.. ఆటపాటలతో ఆనందంగా గడపడం.. ఇష్టంలేని వారు హోలీకి దూరంగా ఉండటం సహజం. కానీ.. కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలతో హోలీ వేడుకలు జరుపుకోవటం అక్కడి వారి ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దులో ఉండే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో అలాంటి వింతైన ఆచారం కొనసాగుతున్నది. ఇక్కడ ఏటా హోలీ రోజున పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం స్త్రీల మాదిరిగా తయారవుతారు.
ఆడవాళ్ల వేషధారణలో రతీ, మన్మథులను పూజిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల గ్రామానికి అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్నది. గ్రామం సుభిక్షంగా ఉండటానికి, పంటలు బాగా పండటానికి, గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా పురుషులు ఆడవాళ్ల వేషధారణలో పూజలు చేయడం తమ ఆనవాయితీ అని స్థానికులు చెప్తున్నారు. ఈ విచిత్ర సంప్రదాయాన్ని చూడటానికి చుట్టుపక్కల వారే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని సమాచారం.