హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణను అష్టకష్టాల పాల్జేసిన ప్రధాని మోదీకి.. రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, ఒక వేళ వచ్చినా అడ్డుకొని తీరుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మోదీకి ఆత్మాభిమానం ఉంటే పర్యటనను రద్దుచేసుకోవాలని, లేదంటే అవమానాలకు గురికాక తప్పదని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్ మగ్ధూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పర్యటనను నిరసిస్తూ సింగరేణి ప్రాంత జిల్లాల్లో 10వ తేదీ నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రధాని పర్యటనను అడ్డుకొని జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. రాష్ర్టానికి న్యాయం జరిగే వరకు ఈ గడ్డపై మోదీ అడుగు పెట్టవద్దని తేల్చిచెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలనే కనీస మర్యాద, గౌరవం కూడా ప్రధానికి లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ మింగడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని తెలిపారు. కేంద్రంపై పోరాటంలో తమపై దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని చెప్పారు.
తమిళిసై గవర్నరా? బీజేపీ కార్యకర్తనా?
మంత్రులను తన ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడాన్ని కూనంనేని తప్పుబట్టారు. త్వరలో రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. తమిళిసై గవర్నరా? బీజేపీ కార్యకర్తనా తేల్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన తమిళిసై తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వీ సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడారు.