హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని విలేకరులతో మాట్లాడుతూ జూలై 6న ఇందిరాపారు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. పాశ మైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది మరణించి ఏడాది పూర్తవుతున్నప్పటికీ బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం అందకపోవడం దారుణమని కూనంనేని పేర్కొన్నారు. కోటి రూపాయల పరిహారం యాజమాన్యం నుంచి చెల్లించేలా చూస్తామని నాడు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.